ఏ ఏ అంశాల మీద క‌థ‌నాలు వేయాలో మీడియాకి చెప్పిన‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్

September 26, 2021

ఏ ఏ అంశాల మీద క‌థ‌నాలు వేయాలో మీడియాకి చెప్పిన‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా న‌టించిన రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ సంద‌ర్భంగా సాయి ధ‌ర‌మ్ ప్రమాదం మీద రకరకాల కథనాలు ప్రసారం చేసిన మీడియా ఛానెల్స్‌కు చుర‌క‌లు వేశారు. ఓ మనిషి ప్రమాదానికి గురయితే జాలి చూపించాల్సింది పోయి, అస‌లు యాక్సిడెంట్ ఎలా అయ్యింది? ఎంత స్పీడ్ లో వెళ్లాడు? ర్యాష్ డ్రైవింగ్‌ నా ఇలా రకరకాల కథనాలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఆటోని ఓవ‌ర్‌టేక్ చేసే వ్య‌క్తి బైక్‌పై ఎంత స్పీడుతో వెళ్తాడు 35-45 కిలోమీట‌ర్ల వేగం ఉండొచ్చు. ఇసుక మేట‌వేయ‌డం వ‌ల్లే జారి ప‌డిపోయాడు. దానికి జాలి ప‌డ‌డం పోయి ఇలా ర‌క‌రకాల క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం చాలా భాధాక‌రం. అలాంటి వ్య‌క్తుల‌కి చిన్న విన్న‌పం కొంచెం క‌నిక‌రం చూపించండి మేము మ‌నుషుల‌మే క‌దా…ఇలాంటి ప‌రిస్థితి రేపు మీకు కూడా రావచ్చు క‌దా అని గ‌ట్టిగానే చుర‌క‌లు వేశారు.

అయితే అంత‌టితో ఆగ‌కుండా ఏ తరహా క‌థ‌నాలు వేయాలో ఐడియాలు ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 45 కిలోమీట‌ర్ల అత్యంత వేగంతో ఆటోని ఓవ‌ర్‌టేక్ చేయ‌బోయి ప‌డిపోయాడు అనే దానిక‌న్నా ఇంకా ఇంట్రెస్టింగ్ క‌థ‌నాలు మీకు చెప్తాను..వైఎస్ వివేకానంద రెడ్డిగారు ఎందుకు హత్యకు గుర‌య్యారు దాని మీద మాట్లాడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ వి కావాలంటే కోడికత్తితో ఒక నాయ‌కున్ని పొడిచారు అదికూడా కేంద్ర ప్ర‌భుత్వం ఆదీనంలో ఉండే ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో..అప్ప‌టి గ‌వ‌ర్న‌రు కూడా దీని వెనుక భారీ కుట్ర ఉంది అని చెప్పారు. ఆ సంగ‌తి ఏమైంది అది అడ‌గండి తేజ్ యాక్సిడెంట్ కాదు…ల‌క్ష‌లాది ఎక‌రాల గిరిజనుల భూములు వారికి ద‌క్క‌డంలేదు.దాని మీద మాట్లాడండి, చిన్నారి చరిత ఉదంతం ఇలాంటి వాటి మీద కథనాలు వేయండి.

ఇంకా స్పైసీ కథనం కావాలంటే వైసీపీ వాళ్లు ఆ మధ్య వ్యభిచారం చట్టబద్దం చేయడానికి మద్దతు పలికారు దాని మీద స్టోరీ వేయండి. టీడీపీ అధికారంలో వుండగా కాపు రిజర్వేషన్ల మీద పోరాడి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు వైసీపీ నాయ‌కులు దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు. బోయ కుల‌స్తులు ఎందుకు రాజ‌కీయ ప్రాతినిథ్యం వ‌హించ‌డం లేదు, ఒక‌ ఆడ బిడ్డ ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్తే క్షేమంగా ఎలా ఇంటికిరావాలి? అనే వాటిపై క‌థ‌నాలు న‌డ‌పండి అని చుర‌క‌లు వేశారు.

ఇడుపులపాయలో నేలమాళిగల్లో కట్టలకు కట్టలు డబ్బులు వున్నాయి అని పోలీసులు చెబుతుంటారు. దాని మీద కథనాలు వేయ‌గ‌ల‌రా? వేస్తే ఇంటికొస్తే కొడతారని భయం. ఇన్ని సమస్యలు వున్నాయి. కేవలం సినిమా వాళ్లు సాఫ్ట్ టార్గెట్ అంటూ ఆవేశంతో ఊగిపోయారు ప‌వ‌న్ క‌ళ్యాణ్